‘నా సరి నీవని.. నీ గురి నేనని..’
ABN , First Publish Date - 2022-07-31T17:19:15+05:30 IST
తమిళంలో విజయవంతమైన ‘దైవత్తాయ్’ (1964) చిత్రం హక్కులు కొని తెలుగులో నిర్మించారు విజయా వారు. తమిళంలో ఎం.జి.ఆర్., బి.సరోజాదేవి పాత్రలను తెలుగులో రామారావు, జమున ధరించారు. తాపీ చాణక్య తన దర్శకత్వ

తమిళంలో విజయవంతమైన ‘దైవత్తాయ్’ (1964) చిత్రం హక్కులు కొని తెలుగులో నిర్మించారు విజయా వారు. తమిళంలో ఎం.జి.ఆర్., బి.సరోజాదేవి పాత్రలను తెలుగులో రామారావు, జమున ధరించారు. తాపీ చాణక్య తన దర్శకత్వ ప్రతిభతో ఈ తెలుగు చిత్రానికి తమిళమాతృక ఒకటుందనే స్పృహ ఎక్కడా ప్రేక్షకులలో కలుగనీయలేదు. సినిమా ఆద్యంతం క్రైం, సెంటిమెంట్లతో ఒక డిటెక్టివ్ నవల చదువుతున్నంత పకడ్బందీగా నడిపారు. తమిళమాతృకలో కె.బాలచందర్ సంభాషణలు సమకూర్చగా, తెలుగులో డైలాగులు డి.వి.నరసరాజు రాశారు.
ఎన్.టి.ఆర్ సి.ఐ.డి. ఇన్స్పెక్టరు రవిగా నటించారు. తల్లి (పండరీబాయి) పట్ల ప్రేమ, బాధ్యతలు కలిగిన మంచి కొడుకుగా, ప్రియురాలు వసంత (జమున) దగ్గర చిలిపితనంతో పాటు కరకుదనం పోలీసు ఆఫీసరుగా ఆయన నటన అపూర్వం. ముఖ్యంగా ‘ఎందుకయ్యా వుంచినావు’ పాట సన్నివేశంలో వైవిధ్యాన్ని చక్కగా కనబరచారు. ఈ చిత్రంలోని పాటలు ఎన్నేళ్లయినా గుర్తుండిపోతాయి. ఘంటసాల సంగీతంలో పాటలన్నీ సూపర్ హిట్టు. ముఖ్యంగా ‘ఎందుకనో నిను చూడగనే’ పాటలో ‘అడుగడుగున నీ రాజసమంతా ఒలికిస్తూ నువు కలుకుతువుంటే’ అన్న చరణంలో ఎన్.టి.ఆర్. పోతబోసిన చందమామాలా వుంటారు. ఆకాశవాణి కేంద్రాల్లో శ్రోతలు మళ్లీమళ్లీ పాటలు విన్పించమని కోరే చిత్రాల్లో సి.ఐ.డి. ఒకటి.