హీరోయిన్‌గా గాయ‌ని స్వాగతా కృష్ణన్‌

ABN , First Publish Date - 2021-05-24T13:19:19+05:30 IST

కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో పాటలు పాడిన సింగర్ స్వాగతా కృష్ణన్ హీరోయిన్‌గా మారారు.

హీరోయిన్‌గా గాయ‌ని స్వాగతా కృష్ణన్‌

గతంలో జ్యోతిక, విదార్థ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘కాట్రిల్‌ మొళి’ చిత్రంలో ‘డర్టీ పొండాట్టి’, ‘పార్టీ’ చిత్రంలో ‘జీఎస్టీ’, ‘వంజకర్‌’ చిత్రంలో ‘కణ్ణనిన్‌ లీలై’ వంటి పాటలు పాడిన గాయని స్వాగతా కృష్ణన్‌. ఇటీవల ఆమె స్వయంగా గానం చేసి, సంగీతం సమకూర్చి ఓ ఆల్బమ్‌ను విడుదల చేసింది. దీనికి శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో ‘కాయల్‌’ చిత్రం ద్వారా ఈ గాయని కాస్త హీరోయిన్‌గా అవతారమెత్తింది. జె స్టూడియోస్‌ పతాకంపై జేసు సుందరరామన్‌ నిర్మించిన ఈ చిత్రానికి దమయంతి దర్శకత్వం వహించారు. కుల, మతాంతర వివాహాలు చేసుకునే యువతీయువకులకు వారివారి తల్లిదండ్రుల వల్ల ఎదురయ్యే సమస్యను ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం షూటింగ్‌ పుదుచ్చేరి, నాగపట్టణం, వేలాంగన్ని, రామేశ్వరం, కన్నియాకుమారి వంటి సముద్రతీర ప్రాంతాల్లో పూర్తి చేశారు. తాను హీరోయిన్‌గా మారడానికి గల కారణాలను ఆమె వివరించింది. ‘నేను నటన వైపు మొగ్గు చూపడానికి కారణమే నా సోదరి. నటిగా మారాలంటూ తీవ్రమైన ఒత్తిడి చేయడంతో ఆమె మాట కాదనలేక పోయాను. నటనలోని మెళకువలు నేర్చుకునేందుకు థియేటర్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. ప్రస్తుతం కాయల్‌ చిత్రంతో పాటు మరో తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నాను’ అని తెలిపింది.

Updated Date - 2021-05-24T13:19:19+05:30 IST