సౌందర్య: 3వ సినిమా 27వ సినిమాగా విడుదలైంది.. కారణమిదే
ABN , First Publish Date - 2021-11-28T00:50:00+05:30 IST
తెలుగు చిత్రాల్లో గ్రాఫిక్స్కు శ్రీకారం చుట్టిన సినిమా ‘అమ్మోరు’. మరో ఆలోచన లేకుండా నాలుగేళ్ల పాటు కేవలం ఒకే ఒక్క సినిమా తీయడం కోసం కష్టపడడం నిర్మాత ఎం.శ్యాంప్రసాద్ రెడ్డికే సాధ్యమైంది. ‘అమ్మోరు’ చిత్రం తీయడానికి కోటీ ఎనభై లక్షల

తెలుగు చిత్రాల్లో గ్రాఫిక్స్కు శ్రీకారం చుట్టిన సినిమా ‘అమ్మోరు’. మరో ఆలోచన లేకుండా నాలుగేళ్ల పాటు కేవలం ఒకే ఒక్క సినిమా తీయడం కోసం కష్టపడడం నిర్మాత ఎం.శ్యాంప్రసాద్ రెడ్డికే సాధ్యమైంది. ‘అమ్మోరు’ చిత్రం తీయడానికి కోటీ ఎనభై లక్షల రూపాయలు ఖర్చయితే, తెలుగు ప్రేక్షకులు అంతకుముందెన్నడూ చూడని గ్రాఫిక్స్ కోసం కోటి ఇరవై లక్షలు ఖర్చు పెట్టిన శ్యాంప్రసాద్రెడ్డి గట్స్కు హాట్సాఫ్ చెప్పాల్సింది. హీరోయిన్ సౌందర్యకు ఇది మూడో సినిమా. అయితే నాలుగేళ్లు నిర్మాణంలో ఉండడం వల్ల ఆమె 27వ చిత్రంగా ఇది విడుదలైంది. ఈ సినిమా కోసం 180 కాల్షీట్లు ఇచ్చారామె. అప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇది ‘ల్యాండ్ మార్క్ ఫిల్మ్’గా నిలిచింది.
ఆ సమయంలో గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణతో ఈ సినిమాలో అమ్మోరు వేషం వేయించడం మరో సాహసం. అద్భుతంగా ఆ పాత్ర పోషించిన రమ్యకృష్ణ ఆ తర్వాత దేవతల పాత్రలకు కె.ఆర్. విజయ తర్వాత అంత పేరు పొందారు. సురేశ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రామిరెడ్డి విలన్గా నటించారు. బేబి సునయన కీలక పాత్ర పోషించింది. 1995 నవంబర్ 23న విడుదలైన ‘అమ్మోరు’ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రదర్శకుడు కోడి రామకృష్ణకు సరికొత్త ఇమేజ్ వచ్చింది. ఆ తర్వాత ‘దేవి’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’ వంటి గ్రాఫిక్స్ ప్రాధాన్య చిత్రాలు ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్నాయి.
-వినాయకరావు