‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్: అభిమానులపై పోలీసుల లాఠీఛార్జ్‌

ABN , First Publish Date - 2021-12-24T02:56:05+05:30 IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాధే శ్యామ్’. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని కె. కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా

‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్: అభిమానులపై పోలీసుల లాఠీఛార్జ్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రాధే శ్యామ్’. ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని కె. కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను నేడు (గురువారం’ హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులను ఈ వేడుకకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అభిమానుల చేతుల మీదుగా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. 


అయితే మేకర్స్ ఇచ్చిన ఈ పిలుపుతో రామోజీ ఫిల్మ్ సిటీకి భారీగా అభిమానులు తరలివచ్చారు. అభిమానుల తాకిడితో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో అభిమానులను కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల లాఠీఛార్జ్‌తో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగినట్లుగా తెలుస్తోంది. రీసెంట్‌గా జరిగిన అల్లు అర్జున్ ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-24T02:56:05+05:30 IST